ఒకప్పుడు ఏడాదికి రూ.3.3 లక్షల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. నాలుగేళ్లు కష్టపడి పనిచేసినా ఆశించిన స్థాయిలో వేతనం పెరగలేదు. కానీ సరైన సమయంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఏడాదికి దాదాపు రూ.25 లక్షల ప్యాకేజీ అందుకుంటున్న ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుభవం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఐదేళ్ల అనుభవం ఉన్న జావా ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ తన ప్రయాణాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నాడు. టీసీఎస్‌లో నింజా ప్రొఫైల్‌ ద్వారా ఉద్యోగంలో చేరిన అతడు మొదట రూ.3.3 లక్షల వార్షిక వేతనంతో కెరీర్‌ మొదలుపెట్టాడు. జావా, స్ప్రింగ్‌బూట్‌, ఏడబ్ల్యూఎస్‌, ఆంగ్యులర్‌, పైథాన్‌ వంటి ఆధునిక టెక్నాలజీలపై పనిచేసే అవకాశం దక్కిందని తెలిపాడు. నాలుగేళ్ల పాటు ఒకే ప్రాజెక్టులో పనిచేసి మంచి పనితీరు కనబరిచినా వేతనం మాత్రం రూ.7.8 లక్షలకు మాత్రమే చేరిందని వివరించాడు.

కెరీర్‌ వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో 2025 జులైలో ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతడి చేతిలో రెండు మూడు ఆఫర్లు ఉన్నప్పటికీ, 100 శాతం వేతన పెంపు ఇచ్చే బెంగళూరు కంపెనీని ఎంచుకున్నాడు. కెరీర్‌కు ఇది ఉపయోగపడుతుందని సహోద్యోగులు సూచించడంతో బెంగళూరుకు మకాం మార్చాడు. కొత్త ఉద్యోగం, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణంతో అంతా బాగానే సాగింది.

అయితే ఆరు నెలలు గడవకముందే పరిస్థితి మారింది. వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ప్రాజెక్టు నుంచి కొందరిని తొలగించారు. మరికొందరి ప్రాజెక్టులు కూడా ముగిశాయి. దీంతో తన ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలైంది. వెంటనే మరోసారి అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒక వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలో ఎంపికైనప్పటికీ కేవలం 22 శాతం వేతన పెంపు మాత్రమే ఆఫర్‌ చేశారు. మరో మార్గం లేక ఆ ఆఫర్‌ను అంగీకరించి పాత ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

60 రోజుల నోటీస్‌ పీరియడ్‌లో అనేక కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. పలు సంస్థలతో చర్చలు జరిపాడు. చివరకు ఒక అంతర్జాతీయ సంస్థ నుంచి 50 శాతం వేతన పెంపుతో ఆఫర్‌ రావడంతో ఆ కంపెనీలో చేరాడు. ఈ మార్పులతో అతని వార్షిక ప్యాకేజీ రూ.24.8 లక్షలకు చేరింది. ఒక ఏడాది వ్యవధిలోనే జీతం మూడు రెట్లు పెరగడం తనకే ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు.

ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టుదలతో ముందుకు సాగితే అవకాశాలు తప్పకుండా వస్తాయని పలువురు వ్యాఖ్యానించారు. కెరీర్‌లో ఎదురయ్యే కష్టాలు, ఉద్యోగ మార్పులు కొన్నిసార్లు మరింత మంచి అవకాశాలకు దారి తీస్తాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.