నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ఏకసభ్య బెంచ్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తాము దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును విచారణకు స్వీకరించేందుకు రౌస్ అవెన్యూలోని ట్రయల్ కోర్టు 2025 డిసెంబర్ 16న నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కేసును విచారించలేమని ట్రయల్ కోర్టు పేర్కొనడం సరికాదని ఈడీ తన పిటిషన్‌లో వాదించింది.

ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారీ, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఈడీ నిందితులుగా పేర్కొంది. ఒకవేళ ట్రయల్ కోర్టు వాదనను అంగీకరిస్తే పీఎంఎల్‌ఏ చట్టం నిర్వీర్యమవుతుందని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో వాదనలు వినిపించారు.

నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కేవలం రూ. 50 లక్షలు చెల్లించి, యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా కాంగ్రెస్ నేతలు అక్రమంగా హస్తగతం చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం ప్రారంభమైంది.