దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విద్యావ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో సంప్రదాయ వైద్య విద్య భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, పాతకాలపు చదువుల విధానాన్ని పట్టుకుని వేలాడటం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 'విద్యావ్యవస్థను చంపేయండి' అనే క్యాప్షన్తో 'ఎక్స్' (ట్విట్టర్)లో ఆయన పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
"బట్టీ పట్టు, పరీక్ష రాయి, పాస్ అవ్వు, డిగ్రీ సంపాదించు, ఉద్యోగం తెచ్చుకో.. మనపై రుద్దిన ఈ ఫార్ములా పేపర్ను చింపేయాల్సిన సమయం వచ్చింది" అంటూ వర్మ తన పోస్ట్ను ప్రారంభించారు. "ఒక వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ కోసం ఐదేళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కు రెండేళ్లు, స్పెషలైజేషన్ కోసం మరో రెండు మూడేళ్లు.. మొత్తం పదేళ్ల పాటు కష్టపడి నేర్చుకునేదంతా, అతని జేబులో ఉన్న ఏఐకి ఇప్పటికే తెలుసు. డాక్టర్లు చేసే పరీక్షలు, డేటా విశ్లేషణ, రోగ నిర్ధారణ వంటి పనులన్నీ ఇప్పుడు ఏఐ మరింత కచ్చితత్వంతో, వేగంగా, అలసట లేకుండా చేస్తోంది" అని ఆయన వివరించారు.
ఆధునిక ఏఐకి పునాదులు వేసిన జియోఫ్రీ హింటన్ వంటి నిపుణులే.. మనుషుల కన్నా ఏఐ అన్ని పనులను మెరుగ్గా చేస్తుందని చెబుతున్నారని వర్మ గుర్తుచేశారు. "వచ్చే ఒకటి రెండేళ్లలో డాక్టర్లు చేసే పనులను ఏఐ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని నిపుణులు అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు విద్యార్థులు ఇంకా నీట్ కోసం ఎందుకు సిద్ధమవుతున్నారు? వైద్య కోర్సుల్లో ఎందుకు చేరుతున్నారు? రోగ నిర్ధారణ అల్గారిథమిక్గా, సర్జరీలు రోబోటిక్గా మారినప్పుడు, మనిషి అయిన డాక్టర్ కేవలం మధ్యవర్తిగా మిగిలిపోతాడు. దానికోసం పదేళ్ల కోర్సు అవసరం లేదు" అని వర్మ ప్రశ్నించారు.
"నా ఫోన్లో ఇప్పటికే ఉన్న సమాచారాన్ని నేను ఎందుకు బట్టీ పట్టాలి? అని అడిగే యువకుడిని విప్లవకారుడిలా చూస్తున్నారు. కానీ అతనే అసలైన తెలివైన వాడు. సంప్రదాయ విద్యావ్యవస్థ ఇప్పటికే శవాగారంలో ఉన్నప్పుడు, దాన్ని పాతిపెట్టడానికి ఎందుకు నిరాకరిస్తున్నాం? పెద్దల అజ్ఞానం యువత భవిష్యత్తును నాశనం చేయకముందే.. అందరూ మేల్కొని ప్రస్తుత విద్యా విధానాన్ని చంపేయాలి. పిల్లలను ఏఐ వైపు వేగంగా నడిపించడమే ఏకైక మార్గం" అని ఆయన స్పష్టం చేశారు.
వర్మ వ్యాఖ్యలపై ఇంటర్నెట్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. "సర్జరీ రోబోటిక్ కాదు, ఇది తప్పుడు సమాచారం" అని ఒకరు ఖండించగా, "భారత్లో విద్య అతిపెద్ద స్కామ్, మీరు చెప్పింది నిజం" అని మరొకరు మద్దతు తెలిపారు. "పేద విద్యార్థులకు ఈ సంప్రదాయ మార్గమే ప్రయోజనకరం" అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
నీట్ వివాదం నేపథ్యంలో విద్యావ్యవస్థపై ఆర్జీవీ సంచలన పోస్ట్..
