చాలా మందికి ఉదయం లేవగానే వేడివేడి టీ తాగనిదే రోజు మొదలవదు. అయితే, ఈ అలవాటు మన శరీరానికి అవసరమైన ఐరన్‌ను గ్రహించే శక్తిపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు, తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారం ద్వారా లభించే ఐరన్ విషయంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి టీ తాగే సమయంపై దృష్టి పెట్టడం చాలా అవసరమని సూచిస్తున్నారు.

ఎందుకు ఈ సమస్య?
టీలో టానిన్లు, పాలిఫెనాల్స్ అనే సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలోని ఐరన్‌తో, ప్రత్యేకంగా మొక్కల ఆధారిత ఆహారం నుంచి లభించే 'నాన్-హీమ్' ఐరన్‌తో బంధం ఏర్పరుచుకుంటాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించడం కష్టంగా మారుతుంది. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, విత్తనాలు వంటి శాకాహార వనరుల నుంచి లభించేది నాన్-హీమ్ ఐరన్. భోజనంతో పాటుగా లేదా భోజనం చేసిన వెంటనే టీ తాగినప్పుడు ఈ ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. అయితే, మాంసం, చేపలు, చికెన్ వంటి జంతు ఆధారిత ఆహారం నుంచి లభించే 'హీమ్' ఐరన్‌పై దీని ప్రభావం చాలా తక్కువ.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఐరన్ ఉన్న ఆహారంతో పాటు టీ తాగడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక నియంత్రిత అధ్యయనంలో భోజనం చేసిన గంట తర్వాత టీ తాగడం వల్ల ఈ ప్రతికూల ప్రభావం దాదాపు సగానికి తగ్గినట్టు తేలింది. అందుకే భోజనానికి లేదా ఐరన్ సప్లిమెంట్లు వేసుకోవడానికి, టీ లేదా కాఫీ తాగడానికి మధ్య కనీసం ఒకటి నుంచి రెండు గంటల వ్యవధి ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో రక్తహీనత (అనీమియా) సమస్య ఇప్పటికే తీవ్రంగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాల ప్రకారం పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో సగానికి పైగా, అలాగే చిన్న పిల్లల్లో అధిక శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీ-ఐరన్ సంబంధంపై అవగాహన కలిగి ఉండటం ప్రజారోగ్యం దృష్ట్యా చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భిణులు, యుక్తవయసు అమ్మాయిలు, శాకాహారులు, ఇప్పటికే ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు, తరచుగా టీ తాగేవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.

ఐరన్ లోపం లక్షణాలు.. నిపుణుల సూచన
శరీరంలో ఐరన్ స్థాయులు తగ్గితే తీవ్రమైన అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం (బ్రెయిన్ ఫాగ్), కళ్లు తిరగడం, చర్మం పాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి పదేపదే కనిపిస్తే సొంత వైద్యం కాకుండా, వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

అయితే, ఈ కారణంతో టీ తాగడం పూర్తిగా మానేయమని నిపుణులు చెప్పడం లేదు. టీలో యాంటీఆక్సిడెంట్లు వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనికి బదులుగా కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

  • భోజనానికి, టీ తాగడానికి మధ్య కనీసం 1-2 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
  • ఉదయం అల్పాహారంతో పాటో లేదా ఇతర ప్రధాన భోజనాలతో పాటు కాకుండా, భోజనాల మధ్య సమయంలో టీ తాగడం ఉత్తమం.
  • ఆకుకూరలు, పప్పులు వంటి మొక్కల ఆధారిత ఐరన్ వనరులతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, ఉసిరి, నారింజ వంటి వాటిని కలిపి తీసుకోవాలి. విటమిన్ సి ఐరన్ శోషణను పెంచుతుంది.


కాబట్టి అందరికీ ఇష్టమైన టీని మానేయాల్సిన అవసరం లేదు. కేవలం తాగే సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే, ఐరన్ లోపం ముప్పును సులభంగా నివారించవచ్చు. ఐరన్ స్థాయిలపై ఏవైనా అనుమానాలు ఉంటే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.