తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడుతూ, ఆయనతో కలిసి దిగిన ఒక అరుదైన ఫొటోను పంచుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి తన పోస్ట్‌లో.. “ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా.. ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..” అని తన నివాళిని అర్పించారు.