తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు.

"నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక శకం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు" అని బాలకృష్ణ కొనియాడారు. వెండితెరపై దేవుడిగా మెరిసినా, ప్రజాసేవలో నాయకుడిగా నిలిచినా ఆయన జీవన విధానం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతాన్ని నమ్మి, చివరి శ్వాస వరకు సామాన్యుడి సంక్షేమం కోసమే తపించిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు.

"ఆయన కడుపున కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఆయన ఆశయాల వారసత్వాన్ని మోసే భాగ్యం కలగడం నా జీవితానికి దక్కిన అత్యున్నత గౌరవం" అని బాలకృష్ణ తన పోస్టులో పేర్కొన్నారు. నాన్నగారి ఆశీస్సులు, ఆయన నేర్పిన క్రమశిక్షణే తనను ప్రతి అడుగులోనూ నడిపిస్తున్నాయని తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ సమాజానికి ఉపయోగపడటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.