తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'జననాయగన్' (Jana Nayagan)కు సంబంధించిన కీలక దృశ్యాలను ఇంటర్నెట్‌లో లీక్ చేసి, సర్క్యులేట్ చేసిన ఆరోపణలపై తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు గురువారం (జూన్ 4) ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ఆయన నటించిన ఆఖరి (ఫేర్‌వెల్) సినిమా ఇదే కావడంతో, ఈ చిత్రంపై కోలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ లీక్ కావడం తమిళ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.

నిందితులు సోషల్ మీడియా వేదికలు, వివిధ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ లీక్ అయిన కంటెంట్‌ను డిజిటల్‌గా షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను డిజిటల్ ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అసలు ఈ లీక్ ఎక్కడ ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. 

ఈ సినిమా లీక్‌లు ఈ ఏడాది ప్రారంభంలోనే వెలుగుచూశాయి. సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ వివాదాల కారణంగా సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం కాగా.. ఈ లోపే హై-డెఫినిషన్ (HD) క్వాలిటీతో కూడిన క్లిప్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో గత ఏప్రిల్ లోనే పోలీసులు పోస్ట్-ప్రొడక్షన్ విభాగానికి చెందిన కొందరిని అరెస్ట్ చేశారు. తాజా అరెస్టులతో ఈ పైరసీ నెట్‌వర్క్ ఎంత పెద్దదో అర్థమవుతోంది.

ఈ అక్రమ లీక్ వల్ల 'జననాయగన్' చిత్ర నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ పైరసీ నెట్‌వర్క్‌లను పూర్తిగా అణచివేయడంలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు. కాపీరైట్ చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్, సినిమాటోగ్రాఫ్ చట్టాల ప్రకారం ఇటువంటి పైరసీ కంటెంట్‌ను చూడటం లేదా ఇతరులకు షేర్ చేయడం కూడా శిక్షార్హమైన నేరాలని, ప్రజలు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.