యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం 'భోగి' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో దాదాపు 20 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ నిర్వహించనున్నారు.

ఈ క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్‌తో సాగనున్నాయని సమాచారం. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ పోరాట ఘట్టాలను సరికొత్త రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం శారీరకంగా పూర్తిస్థాయిలో మేకోవర్ అయిన శర్వానంద్, ఎంతో రిస్క్‌తో కూడిన స్టంట్లను సైతం డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది.

1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో 'భోగి' కథాంశం సాగుతుంది. ఈ చిత్రంలో శర్వానంద్ 'గంగ' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 'కందుల సులోచనా రాణి'గా నటిస్తుండగా, డింపుల్ హయాతి 'మందారం' అనే బోల్డ్ పాత్రలో సందడి చేయనున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 28న రాఖీ పండుగ కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.