ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.

ఈ ఏడాది మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, వారిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆర్జీయూకేటీ లక్ష్యం మరోసారి నెరవేరిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

ఎంపికైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు తమ ఎంపిక పత్రాలను (Selection Letters) అధికారిక వెబ్‌సైట్ rgukt.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే, సహాయం కోసం 9552300009 అనే వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.