మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) కాంగ్రెస్‌లో విలీనం కానుందన్న ఊహాగానాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఖండించారు. తమ పార్టీకి కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి విలీన ప్రతిపాదన రాలేదని, తమ తరఫున కూడా అలాంటి ప్రతిపాదన పంపలేదని స్పష్టం చేశారు. ఈ చర్చ ఎక్కడి నుంచి మొదలైందో తనకు తెలియదన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్‌కు కూడా కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ మధ్య జరిగిన సమావేశం నేపథ్యంలో కూడా విలీనాలపై జాతీయ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భేటీలో ఏం చర్చించారో తనకు తెలియదని సూలే పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఆ ఇద్దరు నేతలు మాత్రమే ఉన్నారని, అందులో విలీనానికి సంబంధించిన అంశాలు చర్చించారా లేదా అనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

దేశ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ లెక్కల కంటే ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూలే అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుల వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీట్‌ పరీక్ష వ్యవహారంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని అన్నారు.

అధికార కూటమిపై కూడా సూలే విమర్శలు గుప్పించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. కుటుంబాలను చీల్చడం, రాజకీయ పార్టీలను విభజించడం వంటి రాజకీయాలు తమ పార్టీ ఎప్పుడూ చేయలేదని వ్యాఖ్యానించారు.