తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిపోవడంతో, టోకెన్లు లేని భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి నిరంతరాయంగా పాలు, తాగునీరు, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు.

బుధవారం ఒక్కరోజే స్వామివారిని 74,471 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,319 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.68 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.