అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి, 30 ఎంఎల్ కంటే పెద్ద ప్యాక్‌లలో విక్రయించే మందులకు ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు డ్రగ్స్ రూల్స్, 1945ను సవరిస్తూ నేడు (జూలై 10) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటివరకు షెడ్యూల్ 'కే' కింద మినహాయింపు పొందుతున్న ఈ తరహా ఔషధాలను, కఠిన నిబంధనలు అమల్లో ఉండే షెడ్యూల్ 'హెచ్1' జాబితాలోకి చేర్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ధృవీకరించిన ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఫార్మసీలు వీటి అమ్మకాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి. తయారీ సంస్థలు సైతం ఈ ఔషధాల ఉత్పత్తికి ప్రత్యేక లైసెన్సులు పొందడం తప్పనిసరి.

కొన్ని రకాల టానిక్‌లు, దగ్గు మందులలో 80 నుంచి 90 శాతం వరకు ఆల్కహాల్ ఉన్నప్పటికీ, వాటిలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయన్న కారణంతో ఇప్పటిదాకా మినహాయింపులు ఉండేవి. అయితే, వీటిని వైద్యేతర అవసరాలకు, మత్తు కోసం విరివిగా వాడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది అక్టోబర్‌లో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి, అభ్యంతరాలు మరియు సూచనలను స్వీకరించిన ప్రభుత్వం, తాజాగా ఈ తుది నిర్ణయం తీసుకుంది.

తాజా ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఆరోగ్య అవసరాల నిమిత్తం ఈ మందులు కావాల్సిన రోగులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం ప్రస్తుతానికి ఏ ఉత్పత్తిపైనా నిషేధం విధించలేదని, కేవలం నియంత్రణ చర్యలు మాత్రమే చేపట్టిందని స్పష్టం చేసింది. తక్కువ ఆల్కహాల్ మోతాదు ఉన్న లేదా 30 ఎంఎల్ లోపు ప్యాక్‌లకు ఈ నిబంధనలు వర్తించవని అధికారులు వెల్లడించారు.