చరిత్రను రాజులు, యుద్ధాలు, శాస్త్రీయ ఆవిష్కరణలతోనే గుర్తుంచుకుంటాం. కానీ కొన్ని సాధారణ ఆహార పదార్థాలు కూడా ప్రపంచ చరిత్రను మలుపు తిప్పాయి. కొన్ని అనుకోకుండా వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానాలనే మార్చేశాయి. అలాంటి కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..

బ్రెడ్
ప్రాచీన ఈజిప్టులో పిండిని కొంతసేపు అలాగే ఉంచడంతో సహజంగా ఈస్ట్ ఏర్పడి మెత్తని బ్రెడ్ తయారైందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ యాదృచ్ఛిక ఆవిష్కరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్రెడ్ ప్రధాన ఆహారంగా మారింది.

చీజ్
పాలను జంతువుల జీర్ణాశయ భాగాలతో చేసిన సంచుల్లో నిల్వ చేయడంతో అందులోని ఎంజైమ్‌ల కారణంగా పాలు గడ్డకట్టాయి. వాటిని పారేయకుండా తినడం ప్రారంభించడంతో చీజ్ పుట్టిందని అధ్యయనాలు చెబుతున్నాయి. నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఇదొకటి.

చాక్లెట్
మొదట మాయా, అజ్టెక్ నాగరికతల్లో చేదు పానీయంగా మాత్రమే ఉపయోగించిన కోకో, యూరప్‌కు వెళ్లిన తర్వాత చక్కెర కలపడంతో చాక్లెట్‌గా మారింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాపారం, ఆహార పరిశ్రమపై దీని ప్రభావం అమోఘంగా మారింది.

మిరపకాయలు
భారతీయ వంటల్లో మిరపకాయలు తప్పనిసరి అయినా అవి భారతదేశానికి చెందినవి కావు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు అమెరికా నుంచి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువగా పండటంతో దేశమంతా విస్తరించి భారతీయ వంటకాల రుచినే మార్చేశాయి.

బంగాళాదుంప
16వ శతాబ్దంలో దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు చేరిన బంగాళాదుంపపై మొదట అనేక అనుమానాలు ఉండేవట! తర్వాత అధిక దిగుబడితో యూరప్ జనాభా పెరగడానికి, ఆర్థికాభివృద్ధికి దోహదపడింది. అయితే ఇదే పంటపై అధికంగా ఆధారపడటం వల్ల 1840ల్లో ఐర్లాండ్‌లో ఘోర కరవు కూడా వచ్చింది.

మొక్కజొన్న
మెక్సికోలో అడవి గడ్డిగా ఉన్న మొక్కజొన్న క్రమంగా ప్రపంచంలోని ప్రధాన పంటల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఇది మనుషుల ఆహారంతో పాటు పశువుల మేత, బయోఫ్యూయెల్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతోంది.

టమాటా
ఒకప్పుడు టమాటాలు విషపూరితమని యూరప్ ప్రజలు నమ్మేవారు. అందుకే వాటిని అలంకరణ మొక్కలుగా మాత్రమే పెంచేవారు. ఆ అపోహ తొలగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వంటల్లో కీలక పదార్థంగా మారిపోయాయి.

ఇన్‌స్టంట్ నూడుల్స్
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆహార కొరతను దృష్టిలో పెట్టుకుని 1958లో జపాన్‌కు చెందిన మొమోఫుకు ఆండో ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను రూపొందించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీటిని వినియోగిస్తున్నారు.

కాఫీ
కాఫీ కేవలం నిద్రను పోగొట్టే పానీయం మాత్రమే కాదు. పశ్చిమాసియా, యూరప్‌లో కాఫీ హౌస్‌లు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రచయితలు, రాజకీయ నాయకులు కలుసుకునే కేంద్రాలుగా మారి అనేక కొత్త ఆలోచనలకు వేదికయ్యాయి.

యాపిల్
ఐజాక్ న్యూటన్ తలపై యాపిల్ పడిందనే కథ నిజం కాకపోయినా, చెట్టు నుంచి యాపిల్ పడటం చూసిన తర్వాతే గురుత్వాకర్షణపై ఆలోచించడం ప్రారంభించానని న్యూటన్ చెప్పాడు. అందుకే యాపిల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

శాండ్‌విచ్
జాన్ మాంటెగూ అనే బ్రిటిష్ ప్రభువు పేకాట ఆడుతూ, ఆట ఆపకుండా తినేందుకు రెండు బ్రెడ్ ముక్కల మధ్య మాంసం పెట్టి ఇవ్వమని కోరాడట. అలా పుట్టిన శాండ్‌విచ్ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారాల్లో ఒకటిగా నిలిచింది.