బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం తెలంగాణపై ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ సూచన ప్రకారం, బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్లో జలదిగ్బంధం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో 9.64 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య కురిసిన కుండపోత వానతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ముషీరాబాద్, యూసుఫ్గూడ, షేక్పేట్, ఉప్పల్ ప్రాంతాల్లో రోడ్లపైకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందస్తు చర్యగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
