ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా మరింత బలపడింది. హౌలిహాన్‌ లోకే విడుదల చేసిన 2026 ఐపీఎల్‌ బ్రాండ్‌ వాల్యుయేషన్‌ స్టడీ ప్రకారం లీగ్‌ మొత్తం వ్యాపార విలువ రూ.1,97,024.68 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.4 శాతం పెరిగింది. లీగ్‌ బ్రాండ్‌ విలువ కూడా రూ.41,106 కోట్లకు చేరి 10.3 శాతం వృద్ధి నమోదు చేసింది.

బ్రాండ్‌ విలువలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సుమారు రూ.2,987 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రూ.3 వేల కోట్ల మార్కుకు చేరువైన తొలి క్రికెట్‌ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్‌ దాదాపు రూ.2,528 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సుమారు రూ.2,346 కోట్లతో మూడో స్థానం దక్కించుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.2,336 కోట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది.

మిగిలిన జట్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సుమారు రూ.1,608 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌ రాయల్స్‌ దాదాపు రూ.1,541 కోట్లతో ఆరో స్థానం దక్కించుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ రూ.1,513 కోట్లతో ఏడు, గుజరాత్‌ టైటాన్స్‌ సుమారు రూ.1,503 కోట్లతో ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ దాదాపు రూ.1,494 కోట్లతో తొమ్మిది, లక్నో సూపర్‌ జెయింట్స్‌ సుమారు రూ.1,168 కోట్లతో పదో స్థానంలో నిలిచాయి.

2026లో ఫ్రాంచైజీల యాజమాన్యంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్లాక్‌స్టోన్‌, బోల్ట్‌ వెంచర్స్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌తో కూడిన కన్సార్టియం ఆర్సీబీని సుమారు రూ.17,042 కోట్ల విలువకు కొనుగోలు చేసింది. మరోవైపు మిట్టల్‌ కుటుంబం, అదర్‌ పూనావాలా కలిసి రాజస్థాన్‌ రాయల్స్‌ను సుమారు రూ.15,797 కోట్ల విలువతో సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌కు ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు ఈ ఒప్పందాలు నిదర్శనమని నివేదిక పేర్కొంది.