తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో రైతాంగంలో ఆశలు చిగురిస్తుండగా, మరోవైపు పలుచోట్ల వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధానంగా, సింగరేణి గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది.
మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం 46 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో నమోదవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.88 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 96,445 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 24 గేట్లు ఎత్తి 96,472 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అటు కొమురం భీం జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తుండగా, 3 గేట్లు ఎత్తి 10,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
మరోవైపు, భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధర్మపురి వద్ద పుష్కర ఘాట్లను వరద తాకింది. అనంతారం బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల ధాటికి మంచిర్యాల జిల్లాలోని ఇందారం, శ్రీరాంపూర్, కల్యాణి ఖని వంటి సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాకే గనుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వారు పేర్కొన్నారు.
తాలిపేరు, వట్టి వాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..
