ప్రముఖ సామాజిక కార్యకర్త, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు తీవ్రమైన బెదిరింపులు ఎదురైనట్లు ఆయన తల్లిదండ్రులు సంచలన విషయాలు వెల్లడించారు. బీజేపీలో చేరాలని, లేదంటే కుటుంబ సభ్యులకు హాని తప్పదని వీడియో ద్వారా హెచ్చరికలు వచ్చాయని వారు ఆరోపించారు. ఈ బెదిరింపుల కారణంగా తాము 16 రోజుల పాటు ఇల్లు విడిచి బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు.

బుధవారం ఓ మరాఠీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ అభిజీత్ తల్లి అనితా దీప్కే ఈ వివరాలు వెల్లడించారు. అభిజీత్ తన రాజకీయ వ్యంగ్య ఉద్యమాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ బెదిరింపు వీడియో వచ్చిందని ఆమె చెప్పారు. మొదట ఈ విషయాన్ని అభిజీత్ తమకు చెప్పలేదని, తర్వాత "బీజేపీలో చేరకపోతే మీ తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటాం" అని వీడియోలో హెచ్చరించినట్లు చెప్పాడని ఆమె వివరించారు.

"ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని, కానీ మీకు ఇలాంటివి అలవాటు లేవు కాబట్టి కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండమని మా అబ్బాయి చెప్పాడు. ఆ సమయంలో నా భర్తకు రక్తపోటు తక్కువగా ఉండటంతో తను మరింత ఆందోళన చెందాడు" అని అనితా దీప్కే తెలిపారు. కొడుకు సూచన మేరకు తాము కొంకణ్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లి 16 రోజులు ఉన్నామని ఆమె చెప్పారు.

వివిధ పరీక్షలలో జరిగిన అవకతవకలపై న్యూఢిల్లీలో 36 రోజుల పాటు నిరసన చేపట్టి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన అభిజీత్.. ఛత్రపతి శంభాజీనగర్‌కు తిరిగి రానున్న నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఈ విషయాలను పంచుకున్నారు.

అభిజీత్ తండ్రి భగవాన్ దీప్కే మాట్లాడుతూ.. సామాజిక జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు, ప్రశంసలు సహజమని అన్నారు. "సమాజం కోసం పనిచేసేటప్పుడు కొందరు విమర్శిస్తారు, మరికొందరు మెచ్చుకుంటారు. కొందరు తొందరపడి స్పందిస్తే, మరికొందరు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అభిజీత్ చిన్ననాటి జ్ఞాపకాన్ని ఆయన తల్లి పంచుకున్నారు. తన కొడుకు అందరికన్నా ఎక్కువగా వాళ్ల నాన్నకే భయపడేవాడని నవ్వుతూ చెప్పారు. ఒకసారి ప్లంబర్‌తో ఇంట్లో పైపు రిపేర్ చేయిస్తే అది విరిగిపోయి ఇల్లంతా నీరు నిండిపోయిందని, తండ్రి కోప్పడతారనే భయంతో టూర్‌కు వెళ్లడానికి కొన్ని గంటల ముందే బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాడని ఆమె గుర్తు చేసుకున్నారు. "ఆరు నెలల వరకు ఈ విషయం వాళ్ల నాన్నకు చెప్పలేదు" అని ఆమె నవ్వుతూ తెలిపారు.