ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో ఉన్న తరహాలోనే ఏపీలో కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కోరినట్లు ఆయన తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, బుద్ధగయ తరహాలో రాష్ట్రంలోనే తొలిసారిగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ‘మైత్రేయ బుద్ధవిహార్’ను ఆయన ప్రారంభించారు. ఈ బుద్ధవిహార్కు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా, దీనిని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని ఆదుర్రు, బావికొండ, తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఉండ్రాజవరం వంటి బౌద్ధ క్షేత్రాలను కలుపుతూ ఈ సర్క్యూట్ను రూపొందిస్తామని మంత్రి దుర్గేశ్ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించగా, ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక నాగానంద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు బోదగమా ఛాందిమా తెరో బౌద్ధ పతాకాన్ని ఎగురవేశారు.
ఉత్తర భారత తరహాలో ఏపీలో బుద్ధిస్ట్ సర్క్యూట్.. కేంద్రానికి మంత్రి కందుల విజ్ఞప్తి..
