భారత సీనియర్ బ్యాటర్, టెస్టుల్లో జట్టుకు చారిత్రక విజయాలు అందించిన అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియో ద్వారా ప్రకటించాడు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఆయన కెరీర్‌కు తెరపడింది. రహానె రిటైర్మెంట్ ప్రకటనపై బీసీసీఐ వెంటనే స్పందించి, ఆయన సేవలను కొనియాడింది.

"ఒక అద్భుతమైన కెరీర్ ముగిసింది. భారత క్రికెట్‌కు మీరు అందించిన అపారమైన సేవలకు, చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలకు ధన్యవాదాలు. మీ తదుపరి ప్రయాణానికి మా శుభాకాంక్షలు" అని బీసీసీఐ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది.

కెప్టెన్‌గా చెరగని ముద్ర
బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా రహానె తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో ఓటమి ఎరుగని కెప్టెన్‌గా ఆయనకు అరుదైన రికార్డు ఉంది. కనీసం ఐదు మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్లలో అత్యధిక విజయశాతం రహానెదే కావడం విశేషం. అత‌ని సారథ్యంలో భారత్ నాలుగు టెస్టుల్లో గెలిచి, రెండింటిని డ్రా చేసుకుంది.

ఆస్ట్రేలియా గడ్డపై 2020-21లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టును చారిత్రక విజేతగా నిలపడం అత‌ని కెప్టెన్సీ కెరీర్‌లో మరుపురాని ఘట్టం. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించిన రహానె, మెల్‌బోర్న్‌లో అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యంగా గబ్బాలో ఆస్ట్రేలియాకు ఏళ్ల తరబడి ఉన్న ఓటమి ఎరుగని రికార్డుకు బ్రేక్ వేసి సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, 2018లో ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా జట్టును విజయపథంలో నడిపించాడు.

మూడు ఫార్మాట్లలో గణాంకాలు
తన కెరీర్‌లో రహానే 85 టెస్టులు ఆడి 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో కలిపి 5,077 పరుగులు చేశాడు. 90 వన్డేలలో 3 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలతో 2,962 పరుగులు సాధించాడు. ఇక, 20 టీ20 మ్యాచ్‌లలో ఒక అర్ధ సెంచరీతో 375 పరుగులు చేశాడు. ఆటగాడిగా, నాయకుడిగా భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన రహానె రిటైర్మెంట్‌తో ఒక శకం ముగిసినట్లయింది.