తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కంపెనీలు, వాణిజ్య సంస్థలు తమ ఉద్యోగులకు వీలైతే 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించాలని, అది వీలుపడని పక్షంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే దశలవారీగా విధులను ముగించేలా (లాగౌట్) అనుమతించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అడ్వైజరీని విడుదల చేశారు.

భారీ వర్షాల సమయంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ప్రమాదాలను అరికట్టడం, అత్యవసర సేవల వాహనాలకు ఆటంకం కలగకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధానోద్దేశమని పోలీసులు తెలిపారు. కంపెనీలు తమ కార్యాలయ వివరాలతో పాటు ఉద్యోగుల లాగౌట్ సమయాలను ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు. దీనివల్ల ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సులభతరమవుతుందని పేర్కొన్నారు.

ఈ వారం ఆరంభం నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లలో వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలోనూ పోలీసులు ఇటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేస్తున్నామని, దీనివల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించవచ్చని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సున్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సుమారు 1,500 కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని, ట్రాఫిక్ అలర్ట్‌లను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని ఆయన వివరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.