ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్‌కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026 లోక్‌సభలో ఆమోదం పొందడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని చెప్పారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడే దిశగా ఇది కీలక అడుగని అభిప్రాయపడ్డారు.

సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన లోకేశ్‌.. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల మోసాలకు పాల్పడే వారిపై ఇక కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలతో పాటు పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. యువత భవిష్యత్తు రాజకీయాలకు అతీతమని, ప్రతిభ, పారదర్శకత, సమాన అవకాశాలే ఎప్పుడూ గెలవాలని ఆకాంక్షించారు.

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని లోకేశ్‌ అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షను తిరిగి సమయానికి నిర్వహించి, లక్షలాది మంది విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా కాపాడిందని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.

ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందించారు. ఈ బిల్లు లక్షలాది మంది విద్యార్థుల ఆశయాలను కాపాడే కీలక చట్టమని చెప్పారు. పరీక్షల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయమిదని అభిప్రాయపడ్డారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)లో సమగ్ర సంస్కరణల కోసం నందన్‌ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేయడం కూడా కీలక చర్యగా పేర్కొన్నారు.