ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నమోదు అయిన తర్వాత విదేశాలకు పరారైన పదో నిందితుడు (A-10) సైఫ్ అహ్మద్ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఎదుట లొంగిపోయేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కెసిరెడ్డికి సైఫ్ అహ్మద్ అత్యంత కీలక అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్కు సంబంధించిన కోట్ల రూపాయల అక్రమ నగదు లావాదేవీలు, హవాలా వ్యవహారాల్లో సైఫ్ కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు తమ దర్యాప్తులో ఆధారాలు సేకరించారు.
కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయిన సైఫ్ అహ్మద్ కోసం పోలీసులు, సిట్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్న తరుణంలో... ఆయనే స్వయంగా ఏసీబీ కోర్టులో లొంగిపోతానంటూ పిటిషన్ వేయడం ఈ కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది. సైఫ్ లొంగిపోతే ఈ స్కామ్ వెనుక ఉన్న మరికొందరి పాత్ర, నగదు మళ్లింపు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
