ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని, తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడమే విజయానికి కీలకం కానుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలో చెరొక విజయం సాధించాయి. ఫైనల్‌కు నేరుగా వెళ్లే ఈ కీలక పోరులో ఒత్తిడిలో ప్రశాంతంగా ఉన్న జట్టే పైచేయి సాధిస్తుందని పాటిదార్ అభిప్రాయపడ్డాడు.

"ఈ సీజన్ మొత్తం రెండు జట్లు అద్భుతంగా రాణించాయి. మ్యాచ్ రోజున ఏ జట్టు అయితే తమ ప్రణాళికలను మెరుగ్గా అమలు చేస్తుందో, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటుందో ఆ జట్టే గెలుస్తుంది. ఇది పెద్ద మ్యాచ్. మేము నిలకడగా ఉంటూ, మాపై మాకు నమ్మకం ఉంచాలి" అని పాటిదార్ పేర్కొన్నాడు.

తమ బలం బౌలింగేనని స్పష్టం చేసిన పాటిదార్, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటమే తమ వ్యూహమని తెలిపాడు. "మేము డిఫెండ్ చేయడానికి ఇక్కడ లేము, అటాక్ చేసేందుకే ఉన్నాం. ఆరంభంలోనే వికెట్లు తీయడమే మా లక్ష్యం. భువీ, హేజిల్‌వుడ్, రసిఖ్ అదే చేస్తున్నారు. ఇదే పంథాను కొనసాగిస్తాం" అని వివరించాడు.

జట్టు సభ్యుడు వెంకటేశ్ అయ్యర్‌పై పాటిదార్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. "అవకాశాలు రానప్పుడు కూడా వెంకటేశ్ తనను తాను సిద్ధం చేసుకున్నాడు. అతని అంకితభావం, బ్యాటింగ్ ఆర్డర్‌లో అతని ఫ్లెక్సిబిలిటీ అద్భుతం. అవకాశం రాగానే సద్వినియోగం చేసుకున్నాడు" అని అన్నాడు.

తన కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. జట్టు యాజమాన్యం, కోచింగ్ సిబ్బంది, విరాట్ కోహ్లీ, హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ వంటి సీనియర్ ఆటగాళ్ల అనుభవం, సలహాలు తనకు ఎంతో సహాయపడుతున్నాయని పాటిదార్ తెలిపాడు. ప్రశాంతంగా ఉండటం, తన సహజ ప్రవృత్తిని నమ్మడమే తన బలమని పేర్కొన్నాడు.