చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభమైన ఏకైక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ భారత టెస్ట్ జట్టులోకి అధికారికంగా అరంగేట్రం (Debut) చేశాడు. శనివారం ఉదయం టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. తుది జట్టు ఎంపికలో రేసులో ఉన్న హర్ష్ దూబేను పక్కనపెట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మనవ్ సుతార్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీనితో భారతదేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 319వ ప్లేయర్‌గా మానవ్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చైనీస్-కట్ శైలి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా మానవ్ తన డెబ్యూ క్యాప్‌ను అందుకున్నాడు.

23 ఏళ్ల మానవ్ సుతార్ దేశవాళీ (Domestic) క్రికెట్‌లో అద్భుతమైన స్థిరత్వంతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2022 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌పై రాజస్థాన్ తరఫున ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ప్రారంభించిన మానవ్.. ఇప్పటివరకు 29 మ్యాచుల్లో 2.94 ఎకానమీతో 129 వికెట్లు పడగొట్టాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తోనూ రాణించి ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 945 పరుగులు చేశాడు. ముఖ్యంగా గత జనవరిలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 పరుగులతో సెంచరీ చేయడంతో పాటు 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ అనుభవం
భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. అదే శైలిలో రాణించగల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ కోసం చూస్తున్న సెలక్టర్లకు మానవ్ సరైన ఎంపికగా కనిపించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఆడిన అనుభవం కూడా మనవ్‌కు ఉంది. గతంలో 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత ప్రధాన జట్టుకు నెట్ బౌలర్‌గా సేవలు అందించిన మనవ్‌కు, ఇప్పుడు నేరుగా టెస్ట్ క్యాప్ దక్కడం అతడి ఏళ్ల తరబడి శ్రమకు లభించిన గుర్తింపుగా చెప్పవచ్చు.