భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భారత క్రికెట్ జట్టు ఫొటోను షేర్‌ చేశారు. ‘‘ఎంతో ప్రతిభావంతులైన ఈ ఆటగాళ్ల బృందానికి నా శుభాకాంక్షలు. రాబోయే సవాళ్లలో ఈ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని సూర్యకుమార్ రాసుకొచ్చాడు. కెప్టెన్సీ పోయినప్పటికీ జట్టుకు మద్దతుగా నిలిచిన అతడి క్రీడాస్ఫూర్తిని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

మరో పోస్ట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సూర్యకుమార్‌ అభినందించాడు. టీమ్‌ఇండియాకు వైభవ్ ఎంపికవ్వడంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు ఈ అవకాశాన్ని కష్టపడి సంపాదించుకున్నావు. నీ క్రికెట్ ప్రయాణాన్ని చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్‌ను సూర్య మనస్ఫూర్తిగా అభినందించడం విశేషం.

మార్చిలోనే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో అతడు ఫామ్ కోల్పోయాడు. ప్రపంచకప్‌లో కూడా కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా సూర్యకుమార్‌ను పక్కనబెట్టి శ్రేయస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.