ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. ‘ఎంటీ లియాకీ ఫ్రీడమ్‌’ నౌకపై దాడి జరిగిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. నౌక మాస్టర్‌తో నేరుగా మాట్లాడిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించామని తెలిపింది.

కొన్ని రోజులుగా హర్మూజ్‌ జలసంధి పరిసరాల్లో వరుసగా వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలు ఆందోళన కలిగించాయి. అయితే ‘లియాకీ ఫ్రీడమ్‌’ నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి దాడి జరగలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు.

అంతకుముందు ఈ నౌకతో కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా సంబంధాలు ఏర్పడకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫార్వర్డ్‌ సీమన్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కూడా నౌకతో నేరుగా సంప్రదింపులు జరపలేకపోయామని తెలిపింది. అయితే నౌక కదలికలను ట్రాక్‌ చేస్తున్నామని, అది నిర్దిష్ట స్థానంలో సురక్షితంగానే ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది.

ఒమన్‌-హర్మూజ్‌ ప్రాంతాల్లో భారతీయ సిబ్బంది ఉన్న పలు నౌకలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. జూన్‌ 10న ‘ఎంటీ సెట్టెబెల్లో’పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, మరుసటి రోజు ‘ఎంటీ జలవీర్‌’పై దాడి జరిగినప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా సహా సంబంధిత దేశాలకు తన నిరసనను వ్యక్తం చేసింది.