బంగ్లాదేశ్ జాతీయ టెస్ట్ క్రికెటర్, ఆఫ్-స్పిన్నర్ నయీమ్ హసన్ తన సొంత పట్టణమైన చిట్టగాంగ్‌లో పోలీసుల చేతిలో తీవ్ర దాడికి, వేధింపులకు గురయ్యానని సంచలన ఆరోపణలు చేశాడు. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని, పోలీసులు తనపై చేయి చేసుకుని, దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలు బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపగా, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామని స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
బంగ్లాదేశ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ముగించుకుని నయీమ్ హసన్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా,  నిన్న రాత్రి సుమారు 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ కింద పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపారు. ఈ ఘటన గురించి నయీమ్ హసన్ 'క్రిక్‌బజ్' అనే క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. "వారు డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారు. అవసరమైతే నా బ్యాగ్ కూడా తనిఖీ చేసుకోమని నేను వారితో చెప్పాను. కానీ వారు నా గొంతు పట్టుకుని, 'కారు ఎక్కు' అంటూ వారి వాహనంలోకి తీసుకెళ్లారు" 

 "ఎందుకు నా గొంతు పట్టుకున్నారు? అని నేను ప్రశ్నించగా, వారు నన్ను బయటకు తోసేసి, కొట్టి, అసభ్యకరంగా తిట్టారు. నేను దేశం తరఫున టెస్ట్ మ్యాచ్‌లు ఆడే జాతీయ క్రికెటర్‌ని అని చెప్పినా వారు మొదట పట్టించుకోలేదు. పైనుంచి ఫోన్ కాల్స్ వచ్చి, నా గురించి తెలిశాక మాత్రమే వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది" అని నయీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

త్వరలో జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులో నయీమ్‌కు చోటు దక్కింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆరోపణలపై చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (నార్త్) అమీరుల్ ఇస్లాం స్పందించారు. నయీమ్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. "ఈ విషయంపై మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షిస్తాం. మా శాఖ ప్రతిష్ఠ‌కు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఉపేక్షకు తావులేదు" అని ఆయన స్పష్టం చేశారు.