ఓవైపు దేశానికి ఎన్నో పతకాలు అందించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌ జస్పాల్‌ రాణా మృతిపట్ల క్రీడా ప్రపంచం నివాళులర్పిస్తోంది. మరోవైపు మైదానంలో ప్రతిభను వెలికితీయాల్సిన ఓ ఫుట్‌బాల్‌ కోచ్‌ మైనర్‌ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఫుట్‌బాల్‌లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానంటూ ఓ మైనర్‌ను నమ్మించి, మూడేళ్ల పాటు లైంగికంగా వేధించిన ప్రైవేట్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుణ్ని 36 ఏళ్ల అభిజిత్‌ మెండల్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత బాలిక 2023లో వసాయిలోని అతడి ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ కోసం చేరింది. ఈ క్రమంలో ఆమె దగ్గర నమ్మకం సంపాదించుకున్న కోచ్‌, ఫుట్‌బాల్‌లో పెద్ద అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలికకు తెలియకుండా అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు కూడా రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయిన బాలిక చివరకు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం, బెదిరింపులు, బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)లోని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతణ్ని కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.