చైనా సెమీకండక్టర్‌ కంపెనీల నుంచి మెమరీ చిప్‌ల కొనుగోలు చేయాలన్న యాపిల్‌ యోచనపై అమెరికాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ భద్రత దృష్ట్యా అలాంటి నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ద్విపక్ష ఎంపీల బృందం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌కు లేఖ రాసింది. చైనా మార్కెట్‌ కోసం తయారయ్యే ఉత్పత్తుల్లో సైతం చైనా కంపెనీల మెమరీ చిప్‌లను ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. ఒకసారి అలాంటి సరఫరాదారులపై ఆధారపడితే భవిష్యత్తులో దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

రిపబ్లికన్‌ సెనేటర్‌ జిమ్‌ బ్యాంక్స్‌, డెమోక్రటిక్‌ సెనేటర్‌ చక్‌ షూమర్‌ నేతృత్వంలో ఈ లేఖ పంపించారు. చైనా సంస్థలైన సీఎక్స్‌ఎంటీ, వైఎంటీసీ నుంచి మెమరీ చిప్‌లను కొనుగోలు చేయవద్దని కోరారు. ఈ రెండు సంస్థలు చైనా సైన్యానికి సహకరిస్తున్న కంపెనీల జాబితాలో ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ ఇప్పటికే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి సంస్థలపై ఆధారపడటం యాపిల్‌కు దూరదృష్టి లేని నిర్ణయమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వినియోగ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీగా ఉన్న యాపిల్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారిత సర్వర్లు, పరికరాల తయారీ వేగంగా పెరగడంతో చిప్‌ల కొరత ఏర్పడింది. ఎన్విడియా వంటి సంస్థల డిమాండ్‌ కూడా పెరగడంతో ధరలు ఎగిశాయి. ఈ ప్రభావంతో యాపిల్‌ ఇటీవల మ్యాక్‌, ఐప్యాడ్‌, హోమ్‌ డివైస్‌లు, విజన్‌ ప్రో ఉత్పత్తుల ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం యాపిల్‌ అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అయితే చైనా మార్కెట్‌కే పరిమితం చేస్తామని చెప్పినా భవిష్యత్తులో అదే చిప్‌లు ఇతర దేశాల్లో విక్రయించే ఉత్పత్తుల్లోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గుతుందన్న వాదనను కూడా వారు ప్రశ్నించారు. కొన్ని విశ్లేషణల ప్రకారం సీఎక్స్‌ఎంటీ చిప్‌ల ధరలు ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. అందువల్ల భద్రతా ముప్పును స్వీకరించే అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఆగస్టు 21లోగా సీఎక్స్‌ఎంటీ, వైఎంటీసీ చిప్‌లను తమ ఉత్పత్తుల్లో ఉపయోగించబోమని యాపిల్‌ స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎంపీలు కోరారు. ఈ రెండు సంస్థలతో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరిపిందో, సాంకేతిక సమాచారం పంచుకున్నదా అనే వివరాలు వెల్లడించాలని కూడా డిమాండ్‌ చేశారు. అయితే ఈ లేఖపై యాపిల్‌ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.