గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు జావెలిన్‌ త్రో విభాగంలో శుభారంభం లభించింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రాతో పాటు రోహిత్‌ యాదవ్‌, యశ్‌వీర్‌ సింగ్‌ ముగ్గురూ పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌కు అర్హత సాధించారు. బలమైన గాలుల కారణంగా అథ్లెట్లకు త్రో విసరడం కష్టంగా మారినా, అత్యుత్తమ ప్రదర్శన చేసిన 12 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగే ఫైనల్లో ఈ ముగ్గురు భారత అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు.

ఈ అర్హత పోటీలో ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ దూరమైన 84 మీటర్లను ఏ అథ్లెట్‌ అందుకోలేకపోయాడు. నీరజ్‌ చోప్రా తన రెండో ప్రయత్నంలో 79.61 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాడు. అప్పటికే అర్హత ఖరారవడంతో చివరి ప్రయత్నాన్ని ఉపయోగించుకోలేదు. రోహిత్‌ యాదవ్‌ 78.37 మీటర్లు విసిరి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. యశ్‌వీర్‌ సింగ్‌ 78.36 మీటర్లుతో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు.

గతేడాది సెప్టెంబర్‌ నుంచి నీరజ్‌ చోప్రాను నడుము కింది భాగం గాయం వేధిస్తోంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు ముందు ఈ గాయం కావడంతో అతను ఆశించిన స్థాయిలో రాణించలేక ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ను కూడా ఆలస్యంగా ప్రారంభించాడు. జూన్‌లో జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌లో ఒక్కసారి మాత్రమే బరిలోకి దిగి 85.69 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు.

అర్హత పోటీలో శ్రీలంక అథ్లెట్‌ రుమేశ్‌ పతిరాజే 82.84 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో అతని పేరిట ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో 92.62 మీటర్లు ఉంది. గ్రెనడాకు చెందిన రెండుసార్ల ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ 81.29 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా అథ్లెట్‌ డౌ స్మిట్‌ 80.64 మీటర్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు.

ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌ ఈస్ట్‌ నాలుగో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా అథ్లెట్‌ కామెరాన్‌ మెక్‌ఎంటైర్‌ ఆరో స్థానంలో నిలిచాడు. ఒలింపిక్‌ ఛాంపియన్‌, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనగా 78.63 మీటర్లు విసిరి ఏడో స్థానంతో ఫైనల్‌కు చేరాడు. దీంతో శుక్రవారం జరిగే ఫైనల్లో నీరజ్‌ చోప్రా, అర్షద్‌ నదీమ్‌ మధ్య మరో ఆసక్తికర పోరు చూసే అవకాశం ఏర్పడింది.